Wednesday, December 25, 2013

జల సంరక్షణే శ్రీరామరక్ష
 

ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం సన్నగిల్లుతుందన్న, వర్షాతిరేకం వెల్లివిరుస్తుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో చెరువులు, కుంటల సముద్ధరణ, సంరక్షణపై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. వూరూరా చెరువులు, కుంటల సంరక్షణ చర్యలు చేపడితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనడంలో సందేహం లేదు. జూన్‌-సెప్టెంబర్‌ మధ్యకాలంలో దేశంలో 89సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ సంస్థ, అమెరికాలోని అంతర్జాతీయ వాతావరణ పరిశోధన సంస్థ, దక్షిణ కొరియా సంస్థ ఏపీఈసీ వాతావరణ కేంద్రం, 'స్కయిమెట్‌ వెదర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థలన్నీ శుభం పలుకుతున్నాయి.

సమయం మించుతోంది...
కిందటి సంవత్సరం కొన్నిచోట్ల మినహాయిస్తే వివిధ ప్రాంతాల్లో చెరువులు, కుంటలను నింపగల వానలు కురవలేదు. నాగార్జునసాగర్‌ జలాశయం కనీసం నాలుగో వంతు కూడా నిండలేదు. వర్షాధారంగా సాగయ్యే 4.05కోట్ల ఎకరాల్లో సగం భూమి అరకొర వానల కారణంగా బీడుగానే మిగిలిపోయింది. రాష్ట్రంలోని 73,604 చెరువుల్లో- 44,417 వినియోగంలో ఉన్నాయి. ఈ చెరువులవల్ల 23.45లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా పట్టుమని 10శాతం భూమీ తడవడంలేదు. 2011-12లో 2,157 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయించగా- పనులు అరకొరగా, అస్తవ్యస్తంగా సాగాయి. నిరుడు వర్షాలు బాగా కురిసి వరదలొచ్చి ఉంటే కట్టలు తెగి ఆ పనుల బండారమూ బట్టబయలయ్యేది! నీటి వనరుల్లో పేరుకున్న పూడికను తొలగించటం, చెరువుల కట్టలను పటిష్ఠం చేయడం, కాల్వలను బాగుచేయడం వంటి పనులను చిత్తశుద్ధితో పూర్తిచేస్తేనే ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ నెలలో చెదురుమదురు వర్షాలు కురవవచ్చునని అంచనాలు వెలువడుతున్నప్పటికీ, కానీ జిల్లాలకు ఇంకా నిధులు మంజూరు కాక చెరువుల బాగుసేత పనులే ఆరంభం కాలేదు. సమయం మించిపోతోంది. వర్షాలు కురిస్తే పనులు చేయడం దుర్లభం. మార్చి నుంచి యుద్ధప్రాతిపదికన కదిలితేనే తొలకరి నాటికి కొంతవరకైనా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగాన్ని తీవ్ర కుదుపులకు గురిచేసిన ఉపాధి హామీ పథకం కింద కొన్ని చెరువుల్లో పనులు సాగుతున్నా- అవి చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఎండల సాకుతో ఉదయం 8-10 గంటల మధ్య ఆ పనులు మందకొడిగా సాగుతున్నాయి. 'సవ్యంగా పనులు చేస్తే పూడిక మొత్తం పోయి చెరువులు పాతాళం లోతులో కనిపించేవి. అయిదేళ్ల నుంచీ కోట్ల రూపాయలు ఖర్చయినా ఫలితం శూన్యమని' కూలీలతో జరిగిన సమావేశంలో ఓ మంత్రి వ్యాఖ్యానించడం ఈ పథకం డొల్లతనాన్ని వెల్లడి చేస్తోంది. పూడిక తీసిన మట్టిని కట్టబయట పోయాల్సి ఉండగా లోపలి వాలుపై పరిచేయడంవల్ల వర్షాలు కురిసినపుడు చెరువులోకి తిరిగి పూడిక చేరుతోంది. ఏటా ఇదే తంతు సాగుతూ నిధులు నిష్ప్రయోజనమవుతున్నాయి. లోపాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించకుండా వదిలేసిన పక్షంలో- ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా తయారవుతోంది పరిస్థితి.
మొక్కుబడి పనులు
కరీంనగర్‌ జిల్లాలో 70 పెద్ద చెరువుల కట్టలు తెగిపోయి నాలుగేళ్లుగా ఆయకట్ట నీరు అందడం లేదు. 210 చెరువుల్లో ఉపాధి పనులు సాగుతుండగా 450 చెరువుల బాగు సేతకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలోని 5,500 చెరువులు, కుంటల మరమ్మతుకు వేయి కోట్ల రూపాయలు అవసరం కాగా, కేవలం వంద కోట్ల రూపాయలే కేటాయించారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గొలుసుకట్టు చెరువులు అనేకం మరమ్మతులకు సిధ్ధంగా ఉన్నాయి. కొన్నింటిని బాగుచేసి మరి కొన్నిటిని వదిలేశారు. ఒక చెరువు వరద మరో చెరువు కట్టను తెగ్గొట్టే ప్రమాదం ఉంది. ఒక చెరువు నిండాక అందులోని నీరు తూము ద్వారా క్రమంగా మరో చెరువుకు చేరితేనే చేసిన పనులు నిలుస్తాయి. రంగారెడ్డి జిల్లాలో మూడు వేల పైచిలుకు చెరువు కుంటలు పూడి రూపం కోల్పోయి పొలాల మట్టానికి వచ్చాయి. నిరుడు కేవలం 40 చెరువులకు మాత్రమే మొక్కుబడిగా మరమ్మతులు చేయగలిగారు. నల్గొండ జిల్లాలో భారీ నీటి వనరులన్నింటికీ మరమ్మతులు అవసరం కాగా- కేవలం 136 చెరువులనే బాగు చేశారు. కర్నూలు జిల్లాలో 1,134 చెరువులుండగా రూ.10కోట్లు వెచ్చించి నిరుడు వేసవిలో 40చెరువులకు మాత్రమే అరకొర మరమ్మతులు చేశారు. కడప జిల్లాలో 1,845 చెరువులుండగా 63చోట్ల మాత్రమే మరమ్మతులు చేశారు. ఈ జిల్లాలో 303 పెద్ద చెరువుల కట్టలు బలహీనంగా ఉన్నాయి. తూములు దెబ్బతిని, వాటి తలుపులు మొరాయిస్తున్నాయి. నిరుటి వేసవిలో అనంతపురం జిల్లాలో 142, చిత్తూరు జిల్లాలో 165 చెరువుల మరమ్మతులు కొంతమేరకు చేయగలిగారు. వాటి నాణ్యత ఏపాటిదో వరదలొస్తేగానీ స్పష్టం కాదు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అన్ని కోస్తా జిల్లాల్లోనూ చెరువుల కథ ఇదే విధంగా ఉంది.
ఏదీ నాటి సంకల్పం?
కాకతీయ రాజులు, నిజం నవాబులు, కృష్ణదేవరాయలు వంటి పాలకుల కాలంలో ఇప్పటిలా 121కోట్ల జనాభా లేదు. చిత్తశుద్ధి గల పాలకుల ఆదేశాలమేరకు ఆనాడు- తక్కువ శ్రమశక్తితోనే చెరువులు, కుంటలు తవ్వుకోగలిగారు. అప్పట్లోనే రాజులు లోతైన చెరువులు తవ్వి భావితరాలకు గొప్ప మేలు చేశారు. కానీ నేడు ఇంత జనాభా, ఆధునిక యంత్రాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా ఆ చెరువుల్లో కనీసం పూడిక తీసుకోలేని దురవస్థలో ప్రభుత్వాలున్నాయి. అయిదారువందల ఏళ్ల కిందట గానుగ సున్నంతో నిర్మించిన తూములు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉండగా- నేడు అత్యాధునిక పరిజ్ఞానంతో, సాధనాలతో, సిమెంట్‌ కాంక్రీటులతో నిర్మించే నిర్మాణాలు మూణ్నాళ్ల ముచ్చటగా మిగులుతున్నాయి. లోపం ఎక్కడ జరుగుతోందో పసిగట్టి పరిహరించాల్సిన పాలకగణం కేవలం పదవులను నిలబెట్టుకునేందుకే ప్రాధాన్యమిచ్చి మిన్నకుంటోంది. నీరు సమృద్ధిగా చేరే చెరువుల, తూముల నిర్వహణ సరిగాలేక, సగం నీరు వృథాగా వెళ్లిపోతోంది. తూముల తలుపులను మరమ్మతు చేసేందుకు నిధులు లేవంటూ నీటిపారుదల శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు.
అధ్వాన నిర్వహణ
పెద్దయెత్తున 3.3శతకోటి ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కంభం చెరువు నిర్వహణ అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో ఇదే పెద్ద చెరువు. ముప్ఫై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు- 22 గ్రామాలకు తాగునీటిని, 10వేల ఎకరాలకు సాగునీటిని అందించేది. గత ఏడాది ఈ చెరువు కనీసం సగమైనా నిండలేదు. వచ్చిన కొద్దిపాటి నీటిలో ప్రధానభాగం తూముల ద్వారా వృథాగా పోయింది. శతకోటి ఘనపుటడుగుల నీటితో ఎనిమిది వేల ఎకరాల మాగాణిని గాని, 12వేల ఎకరాల్లో ఆరుతడి పంటలను గాని పండించవచ్చు. బిందుసేద్యం ద్వారా అయితే 25వేల ఎకరాల్లో పండించవచ్చు. ఈ లెక్కన కంభం చెరువు నిండితే నిలిచే నీటితో కనీసం 24వేల ఎకరాల మాగాణినిగానీ, 36వేల ఎకరాల ఆరుతడి సాగుగానీ చేయవచ్చు. చెరువు నిండినా తూములు బాగుపడక నీరు వృథాగా పోవడంవల్ల 10వేల ఎకరాలకు మించి ఎన్నడూ సాగు కాలేదు. రూ.15కోట్లు ఖర్చుచేస్తే నీటి వృథాను అరికట్టవచ్చునని రైతులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం కనికరించడంలేదు.
రాష్ట్ర రాజధానికి అనుకుని ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు అయిదేళ్లుగా నీటి నిల్వకు నోచుకోవడంలేదు. 1300 ఎకరాల విస్తీర్ణంలో అనేక కింది చెరువులకు ఆధారమైన ఈ జలాశయం వరద కాలువ ఆక్రమణకు గురై బోసిపోతోంది. వికారాబాద్‌ నుంచి షాబాద్‌, శంషాబాద్‌ మండలాల మీదుగా 86కిలోమీటర్ల మేర వరద కాలువ ఈ చెరువులోకే వస్తుంది. మధ్యలో పహాడీ షరీఫ్‌ ప్రాంతీయులు ఈ కాల్వను ఆక్రమించి ఇళ్లు కట్టేయడంతో నీళ్లు పక్కదారి పట్టి వృథాగా పోతున్నాయి. చెరువుకు నీళ్లు ప్రవహించే మార్గాన్ని సరిచేయాలని పర్యావరణ నిపుణులు, ప్రతిపక్షాలు, రైతులు నాలుగేళ్ల నుంచి ఎన్నోమార్లు విన్నవించుకున్నా సర్కారుకు కనువిప్పు కలగడంలేదు. ఈ చెరువుకు నీరొస్తే 100కు పైచిలుకు గ్రామాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దానికింద ఉండే ఇరవై చిన్న చెరువులకు నీరు చేరుతుంది. దానికిందగానీ, దీని ఉపచెరువుల కిందగానీ సుమారు 20వేల ఎకరాల భూమిలో రెండు పంటలు పండుతాయి.
నీటి సంరక్షణే శ్రీరామరక్ష
ఇందిరమ్మ చెరువులు, సామాజికాభివృద్ధి పథకాల ద్వారా చేపట్టే మట్టిపనుల్లో నిధుల స్వాహామెంతగా జరుగుతోంది. ఈ పనులను చేజిక్కించుకునేందుకు పెద్దయెత్తున పోటీ ఉంటోంది. కడప జిల్లాలో 427 చెరువుల పనులకోసం 46.03కోట్ల రూపాయలను మంజూరు చేసి టెండర్లు పిలవగా, వాటిని దక్కించుకొనేందుకు ఇటీవల ఆ జిల్లాలోని కేంద్ర చిన్ననీటి పారుదల ఇంజినీరు కార్యాలయంలో గుత్తేదారులు బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి తగవు తీర్చాల్చి వచ్చింది. పూడిక తీత పనుల్లో జరుగుతున్న అవకతవకలను సరిదిద్దడంపై ప్రభుత్వం గట్టి శ్రద్ధ పెడితే తప్ప జలవనరుల సద్వినియోగం సాధ్యం కాదు. వానలు లేక నిరుడు మార్చి నాటికి రాయలసీమలో భూగర్భ జలమట్టం సగటున 12.71మీటర్లకు దిగజారిపోయింది. ఈ ఏడాది మార్చినాటికి ఆ మట్టం 17.08మీటర్ల లోతుకు కుంగిపోయింది. తెలంగాణలో భూగర్భ జలమట్టం గత ఏడాది తొమ్మిది మీటర్లకు దిగజారగా, ఈ ఏడాది అది 11.5మీటర్లకు పడిపోయింది. రుతు పవనాలు సానుకూలంగా ఉండబోతున్న తరుణంలో చెరువులు, కుంటలను బాగుపరచి పెద్దయెత్తున నీటిని నిల్వ చేసుకుని ప్రగతికి బాటలు వేయాలి. అప్పుడే భూగర్భ జలమట్టాలు పెరిగి అన్ని ప్రాంతాలకు నీటి లభ్యత సులువవుతుంది. నీటి అవసరాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించి పాలకులు తక్షణం జలసంరక్షణ చర్యలకు పూనుకోవాలి. ఆక్రమణలకు గురై మాయమైన చెరువులను సర్వే చేయించి పునరుద్ధరించడం ద్వారా నీటి నిల్వలను పెంచవచ్చు. చెరువుల్లో జరిగే ఉపాధి పనులు సమర్థంగా, శాస్త్రబద్ధంగా ఉండేలా చూడాలి. చెరువు కట్టలను పటిష్ఠంగా రూపొందించడంతోపాటు పూడికతీతకు, తూముల మరమ్మతుకు, కాల్వల పునరుద్ధరణకు- యంత్రాలను, ఆధునిక సాంకేతికతను వినియోగించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడితేనే ప్రయోజనం ఉంటుంది. అవినీతి, అక్రమాలను అరికట్టడం ద్వారా పనుల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేయాలి. ప్రాజెక్టుల జలాశయాల్లోనూ, పెద్ద చెరువుల్లోనూ మట్టిని తవ్వి తీసుకెళ్లేందుకు రైతులకు అనుమతిని ఇస్తే పూడిక బెడద కొంతైనా తగ్గుతుంది. చెరువు భూముల ఆక్రమణ, కట్టలు తెగ్గొట్టే దుశ్చర్యలను అడ్డుకుని నీటిని కాపాడే బాధ్యతను సాగునీటి సంఘాలు, రైతులు స్వీకరించాలి. తోటలున్న రైతులు 14X14X4 మీటర్ల కొలతలతో వర్షాకాలం గుంత తవ్వించుకుంటే అందులో 10లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ఇందుకు రూ.2,20,232 ఖర్చు అవుతుంది. అందులో 90శాతం సొమ్మును ప్రభుత్వం ప్రోత్సాహక రాయితీ రూపంలో అందిస్తోంది. రైతు 10శాతం ఖర్చును మాత్రమే భరించి నీటిని సమృద్ధిగా పొందవచ్చు. 35X35X4 మీటర్ల గుంతను తవ్వించుకుంటే 50లక్షల లీటర్ల నీటిని సంరక్షించుకోవచ్చు. ఇందుకు రూ.5,91,428 ఖర్చవుతుండగా రైతు రూ.59,142 మాత్రమే భరించాలి. ఇదే విధంగా పొలాల్లో రైతులు సామూహికంగా చిన్న కుంటలు తవ్వుకుని జల సంరక్షణకు పూనుకుంటే పంటలు బాగా పండుతాయి. తొలకరి సమీపిస్తున్న తరుణంలో సర్కారు మీనమేషాలు లెక్కించకుండా జల సంరక్షణ పనులు వేగంగా సాగిస్తే రాష్ట్రంలో పంటల పరిస్థితి మెరుగుపడుతుంది.

No comments:

Post a Comment