'అక్షరాలా' మనది అధమస్థానం!
విద్యలో రాష్ట్రానికి 20వ ర్యాంకు
* ఆరోగ్యంలో బీహార్ కంటే వెనుకబాటు * మౌలిక వసతులు కల్పనలో 14వ స్థానం * 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ప్రణాళికా సంఘం అక్షర క్రమంలో ముందున్నా... అక్షర జ్ఞానంలో మాత్రం మన రాష్ట్రం చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. దేశంలో విద్యాపరంగా జమ్మూకాశ్మీర్ చివరి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆరోగ్యంలో మనం 11వ స్థానంలో నిలిచి బీహార్ కంటే వెనుకబడిపోయాం. మౌలిక వసతుల కల్పనలోనూ రాష్ట్రం పరిస్థితి అంతంతే. మొత్తానికి అన్ని రంగాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల కంటే మన పరిస్థితి అధ్వానంగానే ఉంది. |
![]() |
---|
విద్య, వైద్యం, మౌలిక వసతుల
కల్పనలో జాతీయ సగటు, ఆయా రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలను బట్టి ఇప్పటివరకు
ర్యాంకులను నిర్ణయిస్తూ వచ్చిన ప్రణాళికా సంఘం... తాజాగా ఓ అధ్యయనం
చేయించింది. ఉన్న వనరులను రాష్ట్రాలు ఏ మేరకు వినియోగించుకున్నాయి? తలసరి
వినియోగం ఎంత? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాజగా ఏ రాష్ట్రం
ఎక్కడుందో వెల్లడించింది. ఇదివరకు జరిగిన అధ్యయనాలు నివేదికల ప్రకారం కేరళ
అన్ని రంగాల్లో ముందుండగా... బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్,
ఉత్తరప్రదేశ్ బాగా వెనకబడి ఉండేవి. అయితే తాజా అధ్యయనం ప్రకారం పేద
రాష్ట్రాలైన ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్లలో పరిస్థితి బాగా
మెరుగుపడింది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, జార్ఖండ్ల పరిస్థితి దారుణంగా
ఉంది. హిమాచల్ప్రదేశ్ పనితీరు ప్రశంసనీయంగా ఉండగా, గుజరాత్లో ఆరోగ్య
రంగం అధ్వానంగా ఉంది.
మౌలికవసతుల కల్పనలో
మహారాష్ట్ర అధ్వానంగా ఉండగా, హర్యానా ఈ రెండింటిలోనూ వెనకబడి ఉంది. తాజా
అధ్యయనం రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దోహదపడుతుందని నివేదిక
పేర్కొంది. అనేక అంశాల్లో రాష్ట్రాలను బేరీజు వేయడానికి అవకాశం ఉన్నా,
ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ రంగాలకు మాత్రమే
పరిమితమైనట్లు నివేదిక పేర్కొంది.
మూడు రంగాలపై విశ్లేషణ...: ఈ
మూడు రంగాల్లో 21 రాష్ట్రాలను విశ్లేషించింది. ఆరోగ్య రంగంలో... టీకాలు,
మాతా శిశు మరణాలు, పారిశుధ్యం, పౌష్టికాహార లోపం గల పిల్లలు, ఆసుపత్రుల్లో
ప్రసవాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యా రంగానికి సంబంధించి... నమోదైన
విద్యార్థులు, వారిలో చదవగలిగే స్థాయి, మహిళల అక్షరాస్యత, ఒకటి నుంచి 8వ
తరగతి వరకు బడి మానేసే పిల్లల వివరాలను పరిశీలించారు. మౌలిక రంగాల్లో
వ్యవసాయం, విద్యుత్తు, రవాణాను తీసుకున్నారు.
ఇప్పటివరకు ప్రణాళికా సంఘం...
రాష్ట్రాల పనితీరును అంచనా వేసే విధానాన్ని పరిగణనలోకి తీసుకొని మూడు
విభాగాలుగా (త్రీటైర్) విభజించింది. ఇందులో బాగా పనితీరు కనపర్చిన మొదటి
విభాగంలో కేరళ, గోవా, హిమాచల్, పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర,
హర్యానాలున్నాయి. అయితే ఇప్పుడు మౌలిక వసతుల్లో మహారాష్ట్ర, ఆరోగ్యంలో
హర్యానా పనితీరు సరిగాలేదు. రెండో విభాగంలో ఉన్న పశ్చిమబెంగాల్,
ఉత్తరాఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఒడిశాల
పనితీరు మధ్యస్తంగా ఉంది. మూడో విభాగంలో రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్,
ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లున్నాయి. వీటితో పాటు
2011 జనాభా లెక్కల ఆధారంగా... రాష్ట్రాల వారీగా, గ్రామీణ, పట్టణ
ప్రాంతాల్లో తలసరి వినియోగం, కొనుగోలుశక్తిని కూడా లెక్కలోకి తీసుకొన్నారు.
|
No comments:
Post a Comment